కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ ఛార్జీలు రద్దు: TPCC చీఫ్ రేవంత్ కీలక హామీ

by Satheesh |
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ ఛార్జీలు రద్దు: TPCC చీఫ్ రేవంత్ కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలగాణలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉందని.. 2003కు ముందు విద్యుత్ కోతలు ఉన్నట్లే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్‌పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏసీడీ చార్జీలు రద్దు చేస్తుందని అప్పటివరకు ఎవరూ ఏసీడీ చార్జీలు కట్టవద్దని అన్నారు. విద్యుత్ కోతల విషయంలో రైతు సంఘాలు, రైతులు అందరం కలిసి బషీర్ బాగ్ ఉద్యమం లాంటి మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి దశలో రోడ్డెక్కి నిరసన, ఆ తర్వాత సబ్ స్టేషన్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సారి సరైన నిర్ణయం తీసుకోకపోతే విద్యుత్ సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టులు దోపీడీదారుల పక్షాన ఉంటారో ప్రజల పక్షాన కొట్లాడుతారో నిర్ణయించుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొనలేక పోతున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రైవేటు విద్యుత్ సంస్థల్లో 50 శాతం కమీషన్లు దండుకున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కుప్పకూలిందని.. సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ అమలు చేసి చూపిందన్నారు. రైతులకు అనుకూలమైన విధానాన్ని కాంగ్రెస్ తీసుకువస్తే.. కేసీఆర్ అమలుకాని ప్రకటనలు ఇచ్చి కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. ఈ దోపిడీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లబ్ధిదారులు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 20వేల కోట్ల బకాయి పడిందని.. ట్రాన్స్ కో, జెన్ కో కలిపి 60 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్‌కు రూ.5వేల కోట్లు, ఆరోగ్యశ్రీలో 800 కోట్ల బకాయిలు ఉందన్నారు. కేసీఆర్ ధన దాహంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

విద్యుత్ కొనుగోళ్ళల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని.. ఏపీలో మిగులు విద్యుత్ తక్కువ ధరకే సరఫరా చేస్తామని చెప్పినా కేసీఆర్ సుముఖత చూపకుండా కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే తన నమ్మిన బంట్ల వద్ద కొనుగోలు చేశారన్నారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందంలో లోపభూయిష్టం ఉందని గతంలో ఉద్యోగి రఘు ఫిర్యాదు చేశారని, ఈ ఒప్పందాన్ని అంగీకరించని అధికారిని సైతం కేసీఆర్ బదిలీ చేశారని ఆరోపించారు. గుజరాత్ కంపెనీతో వెయ్యి కోట్లు లంచం తీసుకుని కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని కొనుగోలు చేశారని.. యాదాద్రి పవర్ ప్లాంట్ టెండర్ లేకుండా బీహెచ్ఈఎల్‌కు అప్పగించించి సివిల్ వర్క్‌ను సొంత కాంట్రాక్టర్లకు ఇప్పించి వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. తొమ్మిదేళ్లయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేయలేదని, 10వేల కోట్లు భద్రాద్రి కోసం, 35వేల కోట్లు యాదాద్రి కోసం అప్పు తెచ్చి స్థాయి, అనుభవం లేని అధికారులకు బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. చిన్న ఉద్యోగాలు చేసి, దోపీడికి సహకరించిన ప్రభాకర్ రావుకు, రఘుమా రెడ్డికి ఉన్నతమైన బాధ్యతలు అప్పగించారని అన్నారు. 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.

Next Story